చంద్రబాబు సభలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పై వైసీపీ ఫైర్
టిడిపి ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో చంద్రన్న సంక్రాంతి కానుక వస్త్రాల పంపిణీ లో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఘటనా స్థలంలో ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. నూతన సంవత్సరం తొలి నాడే గుంటూరులో మళ్లీ చంద్రబాబు సభలో తొక్కిసలాట చోటు చేసుకోవడం స్థానికంగా ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు సభలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం పై తీవ్రస్థాయిలో చంద్రబాబును టార్గెట్ చేస్తుంది. ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

ప్రచార ఆర్భాటాల కోసం.. కానుకల పేరుతో ఎంతమందిని బలి తీసుకుంటావ్
చంద్రబాబూ..! అధికారంలో ఉండగా మీకు గుర్తురాని పేదలు… ఎన్నికల ముందు మాత్రమే గుర్తొస్తారా? మీ ప్రచార ఆర్భాటాల కోసం కానుకల పేరుతో ఇంకా ఎంతమందిని బలితీసుకుంటారు అంటూ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబును టార్గెట్ చేసింది వైయస్సార్ సిపి.కానుకలు ఇస్తామంటూ ప్రజలను ప్రలోభపెట్టి ఇంత దారుణానికి ఒడిగట్టారు అంటూ అసహనం వ్యక్తం చేసింది.
ప్రజల ప్రాణాలంటే కనీసం విలువలేని మీకు ప్రజల్లో తిరిగే హక్కు ఎక్కడిది? అంటూ వైసీపీ ప్రశ్నిస్తుంది.

తొక్కిసలాటలో మరణాలు చంద్రబాబు చేసిన హత్యలు
చంద్రబాబూ! మొన్న కందుకూరులో ప్రాణాలు కోల్పోయిన వారిని యజ్ఞంలో సమిదలన్నావు. మరి ఈరోజు గుంటూరులో ప్రాణాలు కోల్పోయిన వారిని ఏమంటావు? నీకు అధికారం కట్టబెట్టడానికి అమాయక ప్రజలు ప్రాణత్యాగం చేయాలా? అంటూ చంద్రబాబు ని టార్గెట్ చేసిన వైసీపీ తొక్కిసలాటలో మరణాలు చంద్రబాబు చేసిన హత్యలని తీవ్రస్థాయిలో విరుచుకు పడుతోంది.

ఇంకెంత మందిని బలి తీసుకుంటావ్ చంద్రబాబు
చంద్రబాబూ..! కందుకూరులో ఎనిమిది మంది చనిపోయిన తర్వాత కూడా మీలో మార్పురాలేదు అంటూ మండిపడింది. ఇవి ముమ్మాటికీ మీరు చేసిన హత్యలే. ఇంకెంత మందిని పొట్టన పెట్టుకుంటావు ? అంటూ వైసీపీ చంద్రబాబును టార్గెట్ చేసింది. నిర్వహణ సరిగా చేతకానప్పుడు సభలు నిర్వహించడం ఎందుకు? అంటూ ప్రశ్నించిన వైసిపి, అమాయకుల ప్రాణాలు తీయడం ఎందుకు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
ఇప్పటికే 11 మంది అమాయకులు నీ వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇంకెంత మందిని బలితీసుకుంటావు అంటూ నిప్పులు చెరిగింది.

నరరూప రాక్షసుడు చంద్రబాబు.. రాజకీయాలకు సామాన్యులే బలి పశువులా
చంద్రబాబూ! ఒకసారి జరిగితే పొరపాటు. మళ్ళీ, మళ్ళీ జరిగితే అది నిర్లక్ష్యం. ఇప్పటికే నీ వల్ల మూడు సందర్భాల్లో 40 నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇంకెంత మందిని పొట్టనబెట్టుకుంటావు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నరరూప రాక్షసుడు చంద్రబాబు అంటూ చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలకు సామాన్యులే బలిపశువులా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కోసం అమాయకులైన సామాన్యులు బలి పశువులుగా మారుతున్నారని, నిర్వహణ చేతకానప్పుడు చంద్రబాబు ఎందుకు ఇలాంటి సభలు నిర్వహించాలని చంద్రబాబును టార్గెట్ చేస్తుంది వైసీపీ.