అభ్యర్థుల ఎంపికపై..
2024 సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకునేలా లక్ష్యాన్ని నిర్దేశించింది. అందులో భాగంగా- అభ్యర్థుల ఎంపికపైనా కీలక నిర్ణయాలను తీసుకుంది. క్యాండిడేట్లను ఎంపిక చేసే విషయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వానికి స్వేచ్ఛ కల్పించింది. వైఎస్ జగన్.. ముందస్తు ఎన్నికలకు వెళ్లినా.. సమర్థవంతంగా ఎదుర్కొనేలా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది.

గ్రామస్థాయిలో..
గ్రామ స్థాయిలో మంచి గుర్తింపు, అందరినీ కలుపుకొని వెళ్లడం, వైఎస్ఆర్సీపీ దూకుడును అడ్డుకొనగలిగే వారికే ప్రాధాన్యత ఇవ్వాలంటూ దిశా నిర్దేశం చేసింది. ఈ క్రమంలో- రాజకీయంగా ప్రాధాన్యత గల ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని బరిలోకి దించడం ఖాయంగా కనిపిస్తోంది.

జాతీయ రాజకీయాల కంటే..
బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పని చేసిన అనుభవం ఉన్న పురంధేశ్వరినీ జాతీయ రాజకీయాల్లో కంటే రాష్ట్ర స్థాయి నాయకత్వ బాధ్యతలను అప్పగించడానికి అధిష్ఠానం ప్రాధాన్యత ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ విషయాన్ని జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ చర్చించినట్లు చెబుతున్నారు.

కేంద్రమంత్రిగా..
కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆ తరువాత ఆమె పార్టీ ఫిరాయించారు. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రధాని మోదీ సమక్షంలో కాషాయ కండువాను కప్పుకొన్నారు. ఆ తరువాత పార్టీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా అపాయింట్ అయ్యారు. ఇప్పుడు- ఆమె రాష్ట్ర రాజకీయాల మీద గట్టి పట్టు సాధించారు. పూర్తిస్థాయిలో రాజకీయ కార్యకలాపాలను రాష్ట్రం నుంచే కొనసాగిస్తోన్నారు.

ముఖ్యమంత్రి అభ్యర్థిగా..
ఈ నేపథ్యంలో పురంధేశ్వరిని బీజేపీ అధిష్ఠానం తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేని పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో పురంధేశ్వరి ఎప్పుడూ పోటీ చేయలేదు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే- అది తొలిసారి అవుతుంది. జాతీయ రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ఆమెను ఉన్నపళంగా అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టడానికి ప్రధాన కారణం- ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉండటమేనని చెబుతున్నారు.

నందమూరి వారసురాలిగా..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వారసురాలిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది పురంధేశ్వరికి. నందమూరి కుటుంబానికి చెందిన నాయకురాలు కావడం వల్ల అటు టీడీపీ ఓటు బ్యాంకును కూడా చీల్చగలదనే అభిప్రాయం బీజేపీలో ఉంది. మహిళ కావడం, గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటం అదనపు బలం అవుతుందని అంచనా వేస్తోంది.