
పవన్ కలిసిన మరుసటి రోజే..
చంద్రబాబును పవన్ కల్యాణ్ కలుసుకున్న మరుసటిరోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కుప్పం పర్యటనలో చంద్రబాబు అడ్డంకులను ఎదుర్కొన్నట్లుగా భావిస్తోన్న నేపథ్యంలో- ఆయనను పరామర్శించడానికి పవన్ కల్యాణ్.. చంద్రబాబు ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఇది కాస్తా తెలుగుదేశం-జనసేన పార్టీల మధ్య పొత్తు పొడిచిందనే అభిప్రాయాలకు తావిచ్చింది. ఆ దిశగానే ఈ ఇద్దరు నాయకులు భేటీ అయ్యారనీ తేలింది.

బీజేపీ సానుభూతిపరుడిగా..
అదే సమయంలో రజినీకాంత్ కూడా చంద్రబాబును కలుసుకోవడం ఆసక్తి రేపుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో భారీగా ఫ్యాన్ బేస్ ఉన్న సూపర్ స్టార్ ఆయన. బీజేపీ సానుభూతిపరుడిగానూ ఆయనపై ముద్ర కూడా ఉంది. రజినీకాంత్ ఇదివరకు రాజకీయ పార్టీని నెలకొల్పుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ- అది కార్యరూపాన్ని దాల్చలేదు. అప్పట్లో ఆయన తన అభిమాన సంఘాలతోనూ విస్తృతస్థాయిలో భేటీ అయ్యారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ ను తీసుకున్నారు.

రాజకీయాల నుంచి..
చివరికి పార్టీ పెట్టే ప్రయత్నాల నుంచి విరమించుకున్నారు. అన్నాత్తీ సినిమా షూటింగ్ సమయంలో రజినీకాంత్ కరోనా వైరస్ బారిన పడటం, ఆ తరువాత అనారోగ్యానికి గురి కావడం వంటి పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సూచనలు, విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అప్పట్లో ప్రకటించారు రజినీకాంత్.

హైదరాబాద్ లో జైలర్..
ఆ తరువాత పూర్తిగా సినిమాలపైనే తన దృష్టిని కేంద్రీకరించారు. రోబో 2, పేట, దర్బార్, అన్నాత్తీ సినిమాలను పూర్తి చేశారు. తాజాగా జైలర్ సినిమాలో నటిస్తోన్నారు. ముత్తువేళ్ పాండ్యన్ క్యారెక్టర్ ను పోషిస్తోన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో సాగుతోంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ భారీ జైల్ సెట్ ను వేశారు హైదరాబాద్ లో. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

శాలువ కప్పి..
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, శాండల్ వుడ్ హ్యాట్రిక్ హీరో శివరాజ్ కుమార్ ఇందులో ఇతర కీలక పాత్రలను పోషిస్తోన్నారు. రమ్యకృష్ణ, ఐశ్వర్య రాయ్ బచ్చన్, ప్రియాంక అరుళ్ మోహన్, త్రిష.. నటిస్తోన్నారీ భారీ బడ్జెట్ సినిమాలో. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా- రజినీకాంత్ మర్యాదపూరకంగా చంద్రబాబును కలిశారు. తన ఇంటికి వచ్చిన తలైవాను చంద్రబాబు శాలువ కప్పి సన్మానించారు.