తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జనసేన నేత, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ చుట్టూ గోదావరి రాజకీయం నడుస్తోంది. రాజమండ్రి రూరల్ నుంచి వచ్చే ఎన్నికల్లో తామే పోటీచేస్తామంటూ అధిష్టానాలకు కుండబద్ధలు కొట్టినట్ల
Andhra Pradesh
oi-Garikapati Rajesh
తెలుగుదేశం-జనసేన మధ్య పొత్తు ఖాయమని వార్తలు వస్తున్న వేళ ఒకే ఒక నియోజకవర్గం కోసం ఇరు పార్టీలకు చెందిన నేతలు పోటీపడుతున్నారు. తాను పోటీచేస్తానంటే.. కుదరదు.. నేనే పోటీచేస్తానంటూ భీష్మించుకు కూర్చున్నారు. పార్టీల అధినేతలు కూడా త్యాగాలకు సిద్ధం కావాలని చెప్పినప్పటికీ వారు మాత్రం పట్టిన పట్టుమీదే ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గ రాజకీయం ఎటువైపు మలుపు తీసుకుంటుందో అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

బుచ్చయ్య చౌదరి, దుర్గేష్ చుట్టూ..
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జనసేన నేత, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ చుట్టూ గోదావరి రాజకీయం నడుస్తోంది. గత ఎన్నికల్లో వీరిద్దరూ రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ, జనసేన తరఫున ప్రత్యర్థులుగా తలపడగా విజయం బుచ్చయ్యచౌదరిని వరించింది. తాజాగా టీడీపీ-జనసేన మధ్య పొత్తు పొడుస్తున్న నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ఇక్కడినుంచి పోటీచేసేదెవరనే ఉత్కంఠ రేకెత్తిస్తోంది. బుచ్చయ్యచౌదరి రాజమండ్రి నగరం నుంచి నాలుగుసార్లు, రాజమండ్రి రూరల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

రాజానగరం వెళ్లడానికి ఇద్దరూ ససేమిరా అంటున్నారు
జనసేనతో పొత్తు కుదురుతున్న పక్షంలో రూరల్ కాకుండా రాజానగరం నుంచి పోటీచేయమని అధిష్టానం సూచించింది. అక్కడ ఇన్ ఛార్జి పెందుర్తి వెంకటేష్ తన పదవికి రాజీనామా చేయడంతో సీటు ఖాళీగా ఉంది. అక్కడ బుచ్చయ్యచౌదరి అయితే పార్టీ నెగ్గుతుందని భావిస్తున్నారు. అయితే అధిష్టానం చెప్పిన ప్రతిపాదనకు గోరంట్ల ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ లేదంటే రాజమండ్రి సిటీ కేటాయించాలని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. జనసేన తరఫున రాజానగరం నుంచి పోటీచేయమని ఆ పార్టీ అధిష్టానం దుర్గేష్ కు చెప్పింది. దీనికి దర్గేష్ కూడా ససేమిరా అంటున్నారు. 2019 ఎన్నికల్లో కందులకు 35వేలకు పైగా ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తుంటే రూరల్ నుంచి టీడీపీ పోటీచేస్తుందని, రాజానగరం వెళ్లాలని అధిష్టానం చెబుతున్నప్పటికీ దుర్గేష్ ఒప్పుకోవడంలేదు. గత ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి వైసీపీ, జనసేన అభ్యర్థులు ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందినవారే పోటీచేశారు. దీంతో కాపుల ఓట్లు చీలిపోయి బుచ్చయ్యచౌదరి సులువుగా గెలిచారు.

ఇరు పార్టీల అధిష్టానాలకు తలనొప్పే..
రానున్న ఎన్నికల్లో వైసీపీ బీసీ వర్గానికి చెందిన నాయకుడు చందన నాగేశ్వరరావును బరిలోకి దించబోతుందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే రూరల్ లో జనసేన గెలవడానికి అవకాశాలున్నాయని భావిస్తున్నారు. రాజానగరం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న జక్కంపూడి రాజాతో కందుల దుర్గేష్ పోటీపడటంవల్ల ఫలితం ఎలా ఉంటుందనేది అర్థం కావడంలేదు. ఎందుకంటే చిరంజీవి కుటుంబంతో రాజా కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరు నేతలు రెండు పార్టీల్లో కీలక నేతలు కావడంతో పొత్తుల సర్దుబాటు కష్టమవుతుందని భావిస్తున్నారు. ఇద్దరూ తమకు రూరల్ సీటు కావాలంటే మొదటికే మోసం వస్తుందని, గత ఎన్నికల్లో వైసీపీ గాలిని తట్టుకొని 10వేలకు పైగా మెజారిటీ ఓట్లతో విజయం సాధించిన గోరంట్ల విషయంలో చంద్రబాబు ఎలా వ్యవహరించబోతున్నారనేదే ఉత్కంఠగా మారింది. రాజమండ్రి సిటీ నుంచి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఉన్నారు. ఆమెను కాదని సిటీ సీటు ఇచ్చే అవకాశం లేదు. దీంతో ఏం చేస్తారో చూడాలి.
English summary
Godavari politics is running around Telugu Desam Party MLA Gorantla Butchaiah Choudhary, Jana Sena leader and former MLC Kandula Durgesh.
Story first published: Thursday, January 26, 2023, 13:58 [IST]