జగన్ తీసుకుంది నిరంకుశ నిర్ణయం .. ఈ నిర్ణయం దుర్మార్గం : సీపీఐ నేత రామకృష్ణ
ప్రతిపక్ష పార్టీల సభలు, సమావేశాలు, రోడ్ షో లు నిర్వహించకూడదని చెప్పడం దుర్మార్గమన్నారు సీపీఐ నేత రామకృష్ణ. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని కందుకూరు, గుంటూరు ప్రమాద ఘటనలను సాకుగా చూపించి, జగన్ తీసుకుంది నిరంకుశ నిర్ణయం అంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణాలు చేయడం మానుకుంటారా అంటూ ఆయన ప్రశ్నించారు.

వైఎస్సార్సీపీ శ్రేణులకు మాత్రమే ప్రత్యేక పరిస్థితులు వర్తిస్తాయా?
ప్రజల కోసం చేస్తున్న ఉద్యమాలను, ప్రశ్నించే గొంతుకలను, ప్రతిపక్షాలను అణచివేసే కుట్రలో భాగంగానే 1861 పోలీస్ యాక్ట్ ఉత్తర్వులు అని సిపిఐ నేత రామకృష్ణ పేర్కొన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో సభలు పెట్టుకునేందుకు అనుమతిస్తామని చెబుతున్నారని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మాత్రమే ప్రత్యేక పరిస్థితులు వర్తిస్తాయా అంటూ ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదిలా ఉంటే చంద్రబాబునాయుడు సభలకు ప్రజల ఆదరణ ఎక్కువగా ఉందని భావిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇది అప్రజాస్వామిక చర్య అంటూ మండిపడుతున్నారు.

ప్రజల భద్రత దృష్ట్యా సభలు, ర్యాలీలు బ్యాన్ చేసిన సర్కార్
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకారం జాతీయ, రాష్ట్ర ,పంచాయతీరాజ్. మున్సిపల్ మార్జిన్ లలో నిబంధనలు వర్తింపజేయాలని నిర్ణయించారు. అంతేకాదు ప్రత్యేక పరిస్థితులలో సభలు సమావేశాలకు ప్రత్యామ్నాయ ప్రదేశాలు ఎంపిక చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

షరతులతో అనుమతించిన ప్రదేశాలలోనే సభలు.. వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు
రోడ్లకు దూరంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ప్రదేశాలను ఎంపిక చేసుకోవాలని, ఎంపిక చేసుకున్న ప్రదేశాలలో మాత్రమే సభలు నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. సభ నిర్వహణకు కూడా షరతులతో కూడిన అనుమతి ఇవ్వాలని, షరతులు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలలో పేర్కొన్నారు. దీంతో ఏపీలో ప్రతిపక్ష పార్టీల నుండి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతుంది.