యావత్ దేశం దృష్టి ఖమ్మం సభ పైన ఉంది: మంత్రి ప్రశాంత్ రెడ్డి
ఖమ్మం సభకు వచ్చిన జనాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారని, యావత్ దేశం దృష్టి ఖమ్మం సభ పైన ఉందని వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కనుచూపు మేర అంతా జనమేనని, జనసంద్రంలా ఖమ్మం నిండిపోయిందని వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. అసలు బహిరంగ సభలు ఎలా ఉంటాయో బిజెపికి తెలియదని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు.
బండి సంజయ్ మాటల్లో అర్థంపర్థం లేదని అసహనం
కేటీఆర్, కెసిఆర్ లను తిట్టడం పనిగా పెట్టుకుంటే ప్రజలు క్షమించరని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. భవిష్యత్తులో దేశంలో ఎక్కడ ఏ సభ జరిగిన ఇలానే ఉంటుందని, బిజెపిలాగా ఇరుకు గల్లీలో పెట్టే ప్రజా సంగ్రామ సభలు తాము పెట్టలేమని వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఖమ్మం సభ ప్లాప్ అయిందని చెబుతున్న బండి సంజయ్ బ్రెయిన్ ఫెయిల్ అయిందంటూ వేముల ప్రశాంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. బండి సంజయ్ మాటల్లో అర్థంపర్థం లేదని అసహనం వ్యక్తం చేశారు.

బండి సంజయ్ కళ్ళు చెక్ చేయించుకోవాలి: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఇక వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రమే కాకుండా, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా బండి సంజయ్ పైన విరుచుకుపడ్డారు. బండి సంజయ్ కు కళ్ళు సరిగ్గా కనిపించడం లేదని కంటి వెలుగు పథకంలో కళ్ళ పరీక్ష చేయించుకోవాలంటూ మంత్రి అజయ్ కుమార్ చురకలంటించారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ సూపర్ హిట్ అయిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. సభను సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఖమ్మంలో జరిగిన సభ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఇతర జాతీయ నేతలు దేశానికి నిజానికి దేశం చేశారని పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ సభ విఫలమైందని చెప్పిన నేతలకు సెటైర్లు
ఇక ఇదే సమయంలో ఖమ్మం జిల్లాకు నిధులను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇదే సమయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడిన పువ్వాడ అజయ్ కుమార్ కర్ణాటకలో కాంగ్రెస్ ఓటమికి కేసిఆర్ సుపారి తీసుకున్నారని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి ప్రత్యేకంగా సుపారీలు తీసుకోవలసిన అవసరం లేదని వాళ్ల నేతలే చాలు అంటూ సెటైర్లు వేశారు. మొత్తంగా బీఆర్ఎస్ సభ విఫలమైందని చెప్పిన నేతలకు తమదైన శైలిలో సెటైర్లు వేశారు తెలంగాణ మంత్రులు.