ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ మాజీ మంత్రి నారాయణకు ఇవాళ సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో ఆయన కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే మంజూరు చేసింది. దీంతో ఆయన బెయిల్ పై కొనసాగే అవకాశముంది.
చిత్తూరులో పదో తరగతి ప్రశ్నా పత్రాల లీక్ కేసులో అరెస్టైన నారాయణకు అనంతరం స్ధానిక కోర్టు బెయిల్ ఇచ్చింది. దీన్ని హైకోర్టులో సవాల్ చేసిన పోలీసులు బెయిల్ రద్దు చేయమని కోరారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ రద్దు చేసి ఆయన్ను రిమాండ్ కు పంపాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై నారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ ఆయన రిమాండ్ పై హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నారాయణ తరఫున ఈ కేసులో సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూత్రా వాదించారు.
ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంతో తనకు నేరుగా సంబంధం లేకపోయినా అరెస్టు చేసి రిమాండ్ కు పంపాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని నారాయణ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై సప్రీంకోర్టులో జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు నారాయణ కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే మంజూరు చేసింది. దీంతో నారాయణకు బెయిల్ తో పాటు రిమాండ్ నుంచి ఊరట దక్కినట్లయింది.