
కేఏ పాల్ రాజకీయం
ఏపీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేరు చెబితే ఆయన పండించే కామెడీ, ఎప్పుడెవరిపై ఎలా వ్యాఖ్యలు చేస్తారో తెలియని అపరిచిత వైఖరి, ట్రంప్, బైడెన్ అంటూ అంతర్జాతీయ నేతల గురించి, మోడీ, షా వంటి జాతీయ నేతల గురించి చేసే వ్యాఖ్యలు గుర్తుకొస్తాయి. ఏపీలోనూ అన్ని రాజకీయ పార్టీలను విమర్శిస్తూ ఇన్నాళ్లు కేఏ పాల్ రాజకీయాలు చేసే వారు.
అయితే ఆయన వ్యాఖ్యల్ని జనం సీరియస్ గా ఎప్పడూ తీసుకోలేదు. దీంతో వరుసగా రెండు ఎన్నికల్లోనూ ప్రజాశాంతి పార్టీ పేరుతో ఆయన చేసిన రాజకీయం ఏమాత్రం పనిచేయలేదు. కానీ తాజాగా మునుగోడు ఉపఎన్నికల్లోనూ స్వయంగా బరిలోకి దిగి కనీస ఓట్లతో డిపాజిట్ కోల్పోయారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఉనికి చాటుకునేందుకు కేఏ పాల్ మరో ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

రూటు మార్చిన కేఏ పాల్
ఇప్పటివరకూ కేఏ పాల్ ఎవరికి మద్దతుగా ఉన్నారు, లేదా ఎవరికి ప్రత్యర్ధిగా ఉన్నారని అడిగితే ఇందులో ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం దొరికేది కాదు. ఎప్పుడు ఎక్కడ ఉంటారో, ఎవరికి మద్దతిస్తారో, ఎవరిని విమర్శిస్తారో తెలియకుండా పాల్ రాజకీయం సాగిపోయింది. ఈ క్రమంలో తాజాగా ఏపీ రాజకీయాల్లో తరచూ కనిపిస్తున్న కేఏ పాల్ ఉనికి చాటుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో వరుసగా పర్యటనలు చేస్తున్న పాల్.. తన రాజకీయ వైఖరిని స్పష్టం చేసేస్తున్నారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో తాను ఎటు ఉండబోతున్నారనే క్లారిటీ ఇచ్చేస్తున్నారు.

టార్గెట్ చంద్రబాబు-పవన్ కళ్యాణ్
ఏపీలో తాజాగా చంద్రబాబు బహిరంగసభల్లో చోటు చేసుకున్న తొక్కిసలాటలపై విపక్షాల కంటే ముందు కేఏ పాల్ స్పందించారు. అలాగే వాటిపై పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేశారు. అంతే కాదు పోలీసులు స్పందించకపోతే హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబును అరెస్టు చేయాలని, ఆయన యాత్రల్ని అడ్డుకోవాలని డీజీపీకి సైతం ఫిర్యాదు చేశారు. ఇవాళ పవన్ కళ్యాణ్ ను కూడా టార్గెట్ చేశారు. పవన్ ను జగన్ తరహాలోనే దత్తపుత్రుడిగా అభివర్ణించారు. చంద్రబాబు టూర్లలో జనం చనిపోతుంటే దత్తపుత్రుడు ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు. ఇంతమంది చనిపోతుంటే పవన్ సినిమాలు చేసుకుంటున్నారంటూ విమర్శించారు.
దీంతో చంద్రబాబు-పవన్ ను పాల్ ఎందుకు టార్గెట్ చేశారనే చర్చ మొదలైంది.

జగన్ కు పరోక్ష మద్దతు ?
అదే సమయంలో చంద్రబాబు, పవన్ పై తీవ్ర విమర్శలు, ఫిర్యాదులతో జగన్ దృష్టిని ఆకర్షించేందుకు పాల్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకూ ఏపీ రాజకీయాల్లో తన వైఖరేంటో తెలియకుండానే రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించి విఫలమైన కేఏ పాల్..ఇప్పుడు మాత్రం తనతోటి విపక్షాల్ని టార్గెట్ చేస్తూ అధికార పక్షాన్ని ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా అధికార వైసీపీకి అండగా ఉండేలా సంకేతాలు పంపుతున్నారు. అదే సమయంలో డీజీపీ ఆఫీసుతో పాటు పోలీసులు కూడా పాల్ ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.
దీంతో పాల్ ఫిర్యాదులపై స్పందించి పోలీసులు చర్యలు తీసుకుంటే మాత్రం ఆయన ప్రాధాన్యం మరింత పెరగబోతోంది.