కూర్చోవడానికి సీట్లు లేవు?
మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం (నెం.20834) వెళ్లే రైలులో దక్షిణ మధ్య రైల్వే టీటీఈలు విధులు నిర్వహిస్తున్నారు. టీటీఈలకు కేటాయించిన సీట్లలో వారు కూర్చుంటున్నారు. అదే సమయంలో తూర్పు కోస్తా టీటీఈలు.. రైల్లో ఎక్కడైనా సీట్లు దొరికితే కూర్చోగలుగుతున్నారు. లేదంటే తలుపుల దగ్గర కూర్చుంటున్నారు. వందేభారత్ రైలు రాత్రికి విశాఖపట్నం చేరుకున్నాక దక్షిణ మధ్య రైల్వే టీటీఈలు అక్కడే నిద్రిస్తారు. తెల్లవారుజామున మళ్లీ అదే రైల్లో ఇలానే ఇబ్బందులు పడుతూ సికింద్రాబాద్ చేరుకుంటున్నారు.

తూర్పు కోస్తా జోన్ లేఖ
ఇలా ఒక రైలులో రెట్టింపు సంఖ్యలో సిబ్బంది ఉండడంతో మానవ వనరులు వృథా అవడమే కాకుండా జోన్ల మధ్య జగడంగా మారింది. సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ నుంచి దక్షిణ మధ్య రైల్వే తన టీటీఈలను వెనక్కి తీసుకోవాలని తూర్పుకోస్తా జోన్ లేఖ రాసింది. ఈ రైలు నిర్వహణను కూడా తూర్పుకోస్తా జోన్ పరిధిలోకి వచ్చే విశాఖపట్నంలో చేస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. రెండు వైపులా తమ సిబ్బందే విధులు నిర్వహిస్తారని జోన్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ పేర్కొన్నారు.

లోకో పైలట్ విషయంలో ఎదురవని ఇబ్బంది
రైలుని నడిపే లోకోపైలట్, అసిస్టెంట్ లోకోపైలట్ విషయంలో ఈ సమస్య ఎదురవడంలేదు. సికింద్రాబాద్లో దక్షిణ మధ్య రైల్వే డివిజన్ లోకో సిబ్బంది డ్యూటీ ఎక్కి విజయవాడలో దిగుతున్నారు. అక్కడినుంచి విశాఖపట్నం వరకు రాజమండ్రి డిపో లోకో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అందరూ దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించినవారే. ఈనెల 16వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చిన వందేభారత్ కు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సీట్ల వినియోగం 100 శాతం కంటే ఎక్కువగా ఉందని వెల్లడించింది.