కొత్త పన్నులు..
తాను కూడా మధ్య తరగతికి చెందిన కుటుంబం నుంచి వచ్చానని.. తాను కూడా ఆ ఒత్తిళ్లను అర్థం చేసుకోగలనని నిర్మలా సీతారామన్ అన్నారు. మధ్యతరగతి ప్రజల విషయంలో ఇబ్బందులు తనకు తెలుసన్నారు. మోదీ ప్రభుత్వం కొత్తగా మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి పన్నులు తీసుకురాలేదని ఆమె వ్యాఖ్యానించారు. అలాగే రూ.5 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంటుందని తెలిపారు.

పెరిగిన మధ్యతరగతి..
27 నగరాల్లో మెట్రో రైలు నెట్వర్క్ను అభివృద్ధి చేయడం, జీవన సౌలభ్యాన్ని పెంపొందించేందుకు 100 స్మార్ట్ సిటీలను రూపొందించడం వంటి అనేక చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం మరింత చేయూతనిస్తుందని ఆర్థిక మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఈ కేటగిరీ కింద జనాభా పెరుగిందని అన్నారు. ఈ క్రమంలో వారి సమస్యలను తాను బాగా అర్థం చేసుకున్నానని నిర్మలా తెలిపారు. ప్రభుత్వం వీరి అభివృద్ధికి ఇంకా చాలా చేస్తుందని వెల్లడించారు.

బ్యాంకుల పరిస్థితి..
2020 బడ్జెట్ నుంచి ప్రతి బడ్జెట్లోనూ ప్రభుత్వం మూలధన వ్యయాన్ని పెంచుతూనే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 35 శాతం నుంచి రూ.7.5 లక్షల కోట్లకు పెంచామన్నారు. బ్యాంకింగ్ రంగానికి సంబంధించి గుర్తింపు, రీక్యాపిటలైజేషన్, రిజల్యూషన్, సంస్కరణలు ప్రభుత్వ రంగ బ్యాంకుల పునరుద్ధరణలో చాలా సహాయపడిందని అన్నారు. దీని కారణంగా మెుండి బకాయిలు తగ్గటంతో పాటు ప్రభుత్వ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది.

పన్ను విధానంలో మార్పు..?
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే చివరి పూర్తి బడ్జెట్. దీని తర్వాత దేశంలోని అనేక రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. అయితే ఇది మధ్యంతర బడ్జెట్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు ముందు ప్రభుత్వం ప్రజలకు మరిన్ని రాయితీలు ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ బడ్జెట్లో పన్ను శ్లాబ్లలో కూడా మార్పులు చేయనున్నట్లు రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ సూచించారు. ఈ మార్పులు చేస్తే 2020లో తీసుకొచ్చిన కొత్త పన్ను విధానంలో ప్రభుత్వం ఆ పని చేస్తుందని తెలుస్తోంది.