
ఆధార్తో పాన్ లింక్..
పన్ను చెల్లింపుదారులు తమ పాన్ కార్డును తప్పనిసరిగా ఆధార్ కార్డుతో లింక్ చేయటానికి మార్చి 31 చివరి గడవు. ఈ గడువు తర్వాత పాన్ కార్డు పనిచేయదు. తద్వారా టాక్స్ పేయర్స్ పాన్ అవసరమయ్యే అనేక ఆర్థిక లావాదేవీలను నిర్వహించటం కష్టతరంగా మారుతుంది. దీనికి తోడు చెల్లింపుల సమయంలో తప్పుడు లేదా చెల్లని పాన్ వివరాలను అందిస్తే వారిపై రూ.10,000 వరకు జరిమానా విధించబడుతుంది.

అడ్వాన్స్ టాక్స్..
రూ.10,000 కంటే ఎక్కువ టాక్స్ చెల్లించేవారు ముందస్తుగా అడ్వాన్స్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 15లోగా 15 శాతం, సెప్టెంబర్ 25లోగా 45 శాతం, డిసెంబర్ 15లోగా 75 శాతం, మార్చి 15 నాటికి 100 శాతం చొప్పున నాలుగు వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. మార్చి తర్వాత బకాయిపై నెలకు 1 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.

టాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్స్..
మీరు 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను ఆదా చేయనట్లయితే.. ఆ పనిని వెంటనే పూర్తి చేయడం ప్రారంభించాల్సి ఉంటుంది. ఆదాయపుపన్ను చట్టంలోని సెక్షన్- 80C కింద రూ.1.50 లక్షల మినహాయింపును పొందవచ్చు. దీనికోసం పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్, సుకన్య సమృద్ధి యోజన, ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ వంటి పెట్టుబడులు ఉపయోగపడతాయి.

అప్డేటెడ్ ఐటీఆర్..
FY 2019-2020 లేదా AY 2020-21కి సంబంధించి అప్డేట్ చేయబడిన ఆదాయ-పన్ను రిటర్న్ను 31 మార్చి 2023లోపు సమర్పించడం అవసరం. గడువు ముగిసిన తర్వాత దానిని ఫైల్ చేయలేరు. రీఫండ్ల విషయంలో మరియు ఆదాయపు పన్ను చట్టం కింద అసెస్మెంట్ లేదా రీఅసెస్మెంట్ కోసం ఏదైనా పన్ను ప్రక్రియ పెండింగ్లో ఉన్నట్లయితే లేదా సంబంధిత అసెస్మెంట్ సంవత్సరానికి పూర్తయినప్పుడు అప్డేట్ చేయబడిన రిటర్న్ను ఫైల్ చేయడం కుదరదని గమనించాలి.

ఫారమ్- 12B..
మీరు అద్యోగం మారినట్లయితే ఫారమ్- 12B పూరించాలని గుర్తుంచుకోండి. దీని పూరించటం ద్వారా మీరు మునుపటి యజమాని నుంచి వచ్చిన జీతం టాక్స్ లెక్కింపు కోసం చేర్చబడుతుంది. దీనిని కొత్త యజమానికి అందించాల్సి ఉంటుంది.

క్యాపిటల్ గెయిన్స్..
2018 బడ్జెట్లో కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రకారం దీర్ఘకాలిక ఈక్విటీ పెట్టుబడులపై క్యాపిటల్ గెయిన్స్ లాభం రూ.లక్ష వరకు మాత్రమే పన్ను రహితంగా ఉంటుంది. స్వల్పకాలిక లాభాలపై క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ 15 శాతంగా ఉంది.

ప్రధాన మంత్రి వయ వందన యోజన..
సీనియర్ సిటిజన్ల కోసం పదవీ విరమణ నిధిని నిర్మించడానికి ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY) వంటి ఆప్షన్లు ఉన్నాయి. ప్రధాన్ మంత్రి వయ వందన యోజన కోసం దరఖాస్తులు 31 మార్చి 2023 వరకు ఆమోదించబడుతున్నాయి. ఈ స్కీమ్ 7.4 శాతం వడ్డీ రాబడి హామీతో పెన్షన్ చెల్లిస్తుంది. ప్రత్యేకంగా 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ల కోసం దీనిని రూపొందించారు. ప్రతి నెల రూ.9,250 పెన్షన్ పొందటం కోసం పాలసీదారులు రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కనీసం రూ.1.62 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే నెలవారీ పెన్షన్ రూ.1000 అందుకోవచ్చు.